Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Sunday, February 15, 2009

మా ఇంటి కధ

దాదాపు రెండేళ్ళుగా నా ప్రమేయం లేకుండా, దానంతటదే వాయిదా పడుతూ వస్తున్న పనొకటుంది. ఊళ్ళో ఉన్న మాఇంటిని పడేసి, తిరిగి కట్టించడం.దాదాపు ఇరవై యేళ్ళ క్రితమే మేము ఇంకొక ఇంటిని కట్టుకున్నా ,అది ఊరి సెంటర్లో ఉండటంవల్లా, ఆ వాహనాల దుమ్మూ, ధ్వని కాలుష్యాల కారణంగా తమకు నివాసయోగ్యం కాదని తేల్చేసారు మా ఇంట్లోవాళ్ళు. దాన్ని అద్దెకిచ్చి ఈ పాత ఇంట్లోనే ఉండటానికి మరొక ముఖ్యమైన కారణం దాదాపు ముప్పైయేళ్ళపైబడిన ఇరుగు-పొరుగు పరిచయాలు.

నిజానికా ఇంటిని మాతాత దాదాపు అరవై యేళ్ళ క్రితం కట్టించాడట. ఒక గది, దాన్నానుకొని ఒక వంటగది. వెనకనున్న ఖాళీ జాగాలో స్నానాదులకోసం ఒక బాత్రుం.ఆ రోజుల్లోనే వాటిని 20 రోజుల వ్యవధిలో నిర్మించారట ఆ నెల్లూరు నుంచొచ్చిన కూలీలు. అదొక రికార్డు. నిజానికి వాళ్ళని మావూళ్ళొ ఎవరో మోతుబరి ఇల్లు కట్టించుకోవటానికి నెల్లూరు నుంచి పిలిపించాడట. వాళ్ళు ఆ పని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఉండగా మా తాత కళ్ళబడటం, మంచి పనివారనే నమ్మకం కారణంగా, ఈయన వాళ్ళని కాళ్ళావేళ్ళా బ్రతిమాలి, ఒప్పించి, ఈ ఇల్లు కట్టించడం. పని సగంలో ఉండగా వాళ్ళకి వాళ్ళ ఊరిమీద, ఇంట్లోవారి మీద గుబులు పుట్టినా, పని ఒప్పుకొని మాట ఇచ్చాక మాట తప్పేరోజులు కాకపోవటం వల్ల ,పాపం అందరూ రోజూ దాదాపు 18 గంటలు కష్టపడ్డారట. పొద్దున్నే నాలుగింటికి పని మొదలెట్టి, గుడ్డివెలుతురైనా రాత్రి దాదాపు పదింటి వరకూ పనిచేసేవారట. ఇప్పటికీ ఇంటి మధ్యగదులు రెండూ చాలాపటిష్టం గా ఉంటాయి. కాలక్రమేణా మా నాన్న ముందున్న ఖాలీ జాగాలో పంచ కట్టించి, మధ్యగదినానుకొని వారగా ఇంకొక గది కట్టించి, మేడ మీదికి మెట్లూ, మరికొన్ని మార్పులు చేర్పులూ చేసి ఇంటికి ప్రస్తుతమున్న రూపు తీసుకురావటం జరిగింది. అయితే ఈ మార్పులన్నీ ఇంతకు ముందున్న ఇంటికి అతుకులే కాబట్టి, కాలక్రమేణా ఆ అతుకులు బలహీనపడి, ఎప్పుడైనా విపరీతంగా వర్షం కురిస్తే ఇల్లు కురవడం ప్రారంభించింది. కొత్త ఇంటికి మారడం కుదరదని నిశ్చయమయ్యాక ఈ ఇంటిని మొత్తం పడగొట్టి తిరిగి కట్టించడం గురించి మా నాన్న నాకు స్పష్టం చెయ్యడం జరిగింది.

నిజానికి నేను ఆ ఇంటినీ నన్నూ ఎప్పుడూ వేరు చేసుకొని చూడలేదు. అందువల్ల ఒక సంవత్సర క్రితం ఇండియా వెళ్ళినప్పుడు, చేయాల్సిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ళంతా ఒకసారి పరికించి చూసుకుంటే, మనసంతా ఏదో అలజడి. ఎన్ని జ్ఞాపకాలూ! ఒకటా రెండా? నేను నడక నేర్చిన బండలూ, నేను పుట్టినప్పటి నుంచి నా ఎదుగుదలకి సాక్షీభూతాలయిన ఆ గదులూ,గోడలూ, భగవంతుడనేవాడు నాకు పరిచయమైన పూజగది, చిన్నప్పడు మేమాడుకున్న ఎన్నో ఆటలకి వేదికైన మిద్దె.... ఇవన్నీ నాకు పరిచయం లేని కొత్తరూపు సంతరించుకుకోవడానికి నామనసొప్పుకోవడంలేదు. రాత్రి పడుకున్నా నిద్ర పట్టలేదు. గది పైకప్పూ, చూట్టూ ఉన్న నాలుగు గోడలూ, తలుపులూ, కిటికీలూ అన్నీ నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లు ఏవేవో ఊహలు. తెలిసీ తెలిసీ జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోబోతున్నట్టు తెలీని బాధ.

ఇంకో రెండురోజుల్లో హైదరాబాదు పయనం, అక్కడినుంచి ఒక వారంలో అమెరికాకి. ఇక ఇంటిని ఇలా చూడడం ఇదే ఆఖరు.బహుశా వేసవి లో పని మొదలు కావచ్చు. పని మొదలయ్యే సమయానికి నేను ఇక్కడుండక పోవటం ఒకరకం గా మంచిదే. నాముందే వాళ్ళు ఇల్లంతా కూలగొడుతుంటే చూడటం నావల్లయితే కాదు

పొద్దున లేచి, టిఫిన్ చేసాక నేను చేసిన మొట్టమొదటిపని నా హేండీకేం లొ ఇల్లంతా వీడియో తీయటం. బహుశా నేను ఆ కేమెరాని కొన్న కొత్తల్లో కూడా అంత శ్రద్దగా దేన్నీ వీడియో తీసుండను. మనసంతా ఏదో చెప్పలేని ఉద్విగ్నతకి లోను కావటం వల్ల నిశ్శబ్దం గా పని పూర్తి చేసాను, సౌండ్ మిక్సింగు తరువాత చేసుకోవచ్చులే అని.


ఇక నా హేండీకాం హడావిడి చూసి, ఆరోజు సాయంత్రం నా చెల్లాయి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు మా అమ్మని అడిగింది "అమ్మా చిన్నన్నయ్య ఈ ఇంట్లో పుట్టాడా లేక హాస్పిటల్లోనా?" అని. నిజానికి మానలుగురు పిల్లల్లో మా చెల్లాయొక్కతే హాస్పిటల్లో పుట్టింది.మేమంతా ఇంట్లోనే పుట్టాం. విషయంలోమా చిన్నప్పుడు చెల్లాయి నేను వాదులాడుకునే వాళ్ళం . తనేమో "నువ్వు ఇంట్లోనే పుట్టావు నేను హాస్పిటల్లో" అని మా గొప్పగా చెప్పుకునేది.నేను చిన్నబుచ్చుకోవటం ఇష్టం లేక మా అమ్మ నాతో "నువ్వు పుట్టింది కూడా హాస్పిటల్లోనేరా" అనేది. అలా అలా అది నాకొక సందేహంగా ఉన్నా, నేను దాన్ని ఎన్నడూ నివృత్తి చేసుకోలేదు. అయితే ఈసారి చెల్లాయి అడిగినదానికి నాకు అమ్మనుంచి కచ్చితమైన సమాధానం దొరికింది.

రోజూ రాత్రి రెండింటి దాకా టివీ చూసే అలవాటున్న నేను, ఆ రోజు పదింటికే టీవీ కట్టేసి, ఎన్నడూలేని విధంగా మధ్యగదిలో చెక్కబీరువా ముందు పక్కేసుకుంటుంటే వింతగా చూసింది మా అమ్మ.

Monday, November 24, 2008

నా వానా కాలం చదువు

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాగిన నా పఠనా ప్రస్థానాన్ని అక్షరబద్దం చేద్దామనే ఆలోచన ఈ టపా కి ప్రేరణ. ఇది రాస్తున్నంత సేపూ నాకని పిస్తూనే ఉంది ఇది సమగ్రమైన టపా కాక పోవచ్చు అని.కొన్నేమో లీలగా గుర్తున్నాయ్, మరి కొన్ని గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఒక్క విషయానే ఒక పెద్ద టపా లా రాయొచ్చు అనిపించేది. ఇక్కడ కుదించి రాసి రెంటికీ చెడ్డ రేవడి లా అవుతున్నదేమో అన్న అసంతృప్తి.దానికితోడు అభిరుచి కొద్దీ నేను చేసిన జర్నలిజం కోర్సు లో నేర్చుకున్న "క్లుప్తత" పాఠం, నన్ను పేజీ లకు పేజీలు రాయనివ్వలేదు. వెరసి ఇదిలా తయారైంది.
************************************************************

మొత్తం మీద చూస్తే నేనేమి పెద్దగా ఏమీ చదూకోలేదు అనిపిస్తుంది నాకు.స్కూలో ఉన్నప్పుడు,కాలేజీ లో ఉన్నప్పుడు ఎడా పెడా చదివి పారేసినా ఉద్యోగపర్వం లోకి వచ్చాక పెద్దగా చదివింది అంతగా లేదు.అదే నాకు కొద్దిగా బాధ కలిగించే విషయం.ఈ పన్నెండేళ్ళలో ఎన్ని వేల గంటల్ని వృధా చేసానో అనిపిస్తుంది నాకు.సద్వినియోగం చేసుకొని ఉంటే ఇంకొన్ని పుస్తకాలు నేను చదివిన లిస్టు లోకి చేరి ఉండేవి కదా.ఏమాట కామాటే చెప్పూకోవాలి నా ఉద్యోగజీవితం మొదలైన కొత్తల్లో పని పరమైన ఒత్తిడి విపరీతంగా ఉండేది. మిగతావారి కంటే వెనక పడ కూడదనే గట్టి పట్టుదలా, ఆ మొదటి నాలుగేళ్ళూ నా సాంకేతిక జ్ఞానాన్ని వృద్ధి పరచుకోవాల్సిన ఆవశ్యకతా, నన్ను నాకిష్టమైన పనికి దూరం చేసాయి. మనకిష్టమైన పనిని ఎన్ని ఇబ్బందులొచ్చినా కొనసాగించటం లోనే గొప్పతనం దాగుంటుంది. నేను మాత్రం ఆ విషయం లో పెద్ద ఫెయిల్యూర్.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి పుస్తకం చందమామ.ఆ తరువాత బాలజ్యోతి,బాలమిత్ర,జాబిల్లి. వీటివల్లనేమో నాకు జానపద చిత్రాలంటే విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.నా చిన్నప్పుడు నేను జానపద చిత్రాల్ని విపరీతంగా చూసేవాడిని. పొద్దున్నే స్కూలు కి వెళ్ళేటప్పుడు ఎన్.టి.రామారావు గారి ఏ "అగ్గి పిడుగో", లేక కాంతా రావు గారి "జ్వాలా ద్వీప రహస్యం" తాలూకు వాల్ పోస్టర్ కనపడిందంటే ఇక మనసంతా ఒకటే ఆలోచన, ఈ సినిమా చూసే వీలు ఎప్పుడూ కలుగుతుందా అని.ఇప్పుడంటే రెండు ఫోన్ నంబర్లు గుర్తుపెట్టు కోవాలంటే బుర్ర కి కొద్దిగా కష్టమవుతుంది గాని చిన్నపుడు నేను ఏకసంధా గ్రాహిని.బాగా చదువుతాననే పేరుండటం చేత ఇంట్లో కూడా నా సినిమా పిచ్చి కి పెద్ద అడ్డుండేది కాదు. అమ్మ దగ్గర ఒక రూపాయుచ్చుకుంటే సినిమా టిక్కెట్టు తోపాటు ఇంటర్వెల్ లో ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు కూడా నా వళ్ళో పడేవి(నావన్నీ నేల టిక్కెట్టు సినిమాలు లెండి).సరే విషయం పక్క దారి పడుతోందనుకుంటా. నా చదువు గోల కాస్తా సినిమా గోల గా మారకముందే దీన్ని ఆపేస్తా.ఆ రోజుల్లో చిన్న చిన్న పాకెట్ సైజు జానపద కధల పుస్తకాలు ఉండేవి.నాదగ్గరున్న ట్రంకు పెట్టెలో దాదాపు ఒక వంద పుస్తకాలుండేవి అట్లాంటివి.అప్పట్లో అవి నాప్రాణం.పాఠ్య పుస్తకాలకుక్కూడా అంత సీనుండేది కాదు వాటిముందు.వాటిని పాన్ షాపుల్లో క్లిప్పులతో ఒక దడి లాగా కట్టి వేలాడదీసి అమ్మేవారు.అట్టమీద బొమ్మ, కధ పేరు కాస్త ఆసక్తికరంగా కనపడిందంటే చాలు ఆ పుస్తకాన్ని కర కరా నమిలి మింగాల్సిందే. లేకుంటే మనసులో చెప్పలేనంత దిగులు.

నాకు ఈనాడు పేపరు చదవటం నా పదోయేటే అలవాటైంది. అతిశయోక్తి అనుకోకుంటే ఒక్క మాట.నా ఈనాడు పఠనం అప్పటినుండి ఇప్పటిదాకా అప్రతిహతం గా కొనసాగుతూనే ఉంది.నేను చదవనిదల్లా పండగలప్పుడు "పండగ సందర్భం గా ఈనాడు కార్యాలయానికి సెలవు"అని వారు సెలవిచ్చినప్పుడే. అప్పటినుంచి ఇప్పటివరకు నేను "ఈనాడు" వీరాభిమానిని(ఈ కుళ్ళు రాజకీయాలని పక్క పెడితే). నా ఆరోతరగతిలో యేసురత్నం గారని సోషల్ టీచరొకరుండేవారు. ఆయన ఆరోజుల్లోనే మాకు డైరీ రాయటం నేర్పించారు. రోజూ ఆయన క్లాసులో మేము క్రితం రోజు రాసిన మా దిన చర్య చూపించాలి. దానితో పాటు ఆరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైనా వార్తలు కూడా రాయాలి. అలా ఒకానొక శుభదినాన నా "ఈనాడు" పఠనం మొదలయింది. నా ఆనాటి దినచర్యలో మొదటి మూడు వాక్యాలు ప్రతిరోజూ ఒకేలా ఉండేవి ఇలా..

"ఈరోజు నేను పొద్దున్నే ఏడుగంటలకు నిద్ర లేచితిని. ఆ వెంటనే పళ్ళుతోమితిని. అటుపిమ్మట కాలకృత్యములు తీర్చుకొని కాసేపు చదువుకొంటిని".

నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ డైరీ అనుకోకుండా నా కంట పడితే ఒక రోజంతా నవ్వుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుకొని.
అప్పుడు నేనుచదివిన ఈనాడు లో నాకిప్పటికీ గుర్తున్న వార్తలు కొన్నున్నాయ్. అవి , రష్యా అధ్యక్షుడు అంద్రోప్రొవ్ మరణం, ఎయిర్ ఇండియా విమానం కనిష్క కూల్చివేత, బందిపోటు రాణి పూలన్ దేవి లొంగుబాటు, మహా కవి శ్రీ శ్రీ మరణం. ఇంకా ఆలోచిస్తే మరికొన్ని గుర్తొస్తాయి గానీ, నాకే అనిపిస్తొంది ఇక్కడ రాయటం అంత అవసరమా అని. మరి చదివే వారు మీకేమనిపించొచ్చో నాకుతెలుసు. సరే, పేపరు నాచేతికి రాగానే మొదట నేను చదివేది మూడో పేజీ లో కుడివైపు కింద భాగం లో ఉండే బొమ్మల కధ. ఒక రెండేళ్ళ పాటు వీటిని కట్ చేసి పుస్తకంగా కుట్టుకున్నాను కూడా. తరువాత క్రీడా వార్తలు, మొదటిపేజీ వార్తలు. కాస్త బుర్ర పెరిగాక మూడో పేజి సంపాదకీయాలూ, కులదీప్ నయ్యరు (లోగుట్టు), ఎ.జి. నూరానీ, చంద్రచూడ్ సింగ్ లాంటీ మహా మహుల వ్యాసాలూ , పుణ్యభూమీ, చలసాని కబుర్లూ వగైరా వగైరా.

ఎప్పుడు , ఎందుకు చదివానో నాకు తెలీదు గానీ నేను నా జీవితంలో చదివిన మొట్టమొదటి నవల మల్లాది వారి "మేఘమాల". నా అదృష్టమేమో నా మొట్టమొదటి నవలే మల్లాది ది కావటం. నాకానవల విపరీతంగా నచ్చింది. ఇంకేముంది జబ్బు ముదిరింది నాకు. దొరికిన నవల్నల్లా చదివి పారెయ్యటమే.దానికి తోడు మా అన్నయ్య ఫ్రెండొకతనికి అద్దె పుస్తకాల షాపుండేది. మల్లాది,యండమూరి, సూర్యదేవర, చందు సోంబాబు,అల్లాణి శ్రీధర్,యర్రంశెట్టి ఒకరేమిటి, పేరున్న, పేరు లేని, పేరుండి ఆ తరువాత పిచ్చి రాతలు రాసి పేరు చెడగొట్టుకున్న వారందరి నవళ్ళూ చదివేసా. మల్లాది కి వీరాభిమానిని కదా ఆయన రూపాయి పత్రిక స్రవంతి నీ పోషించా అదున్నన్నాళ్ళూ. నాకు బాగా నచ్చిన నవలలు బోలెడున్నాయ్ అన్నీ గుర్తు కు రావు గానీ, యండమూరి ఆనందో బ్రహ్మ, ప్రార్ధన, వెన్నెల్లో ఆడపిల్ల, మల్లాది మేఘమాల, సావిరహే,అందమైన జీవితం,మందాకిని వాటిలో కొన్ని. నాకు మల్లాది రాసిన వాటిల్లొ నచ్చని దంటే ఏకలింగం అడ్వెంచర్స్. ఆ తరువాత ఆయన రాసిన రచనల్లో శృంగారం పాళ్ళు ఎక్కువ ఉండటం కూడా నాకు నచ్చలేదు. మొత్తానికి ఆ టైంలో నాకు బాగా నచ్చిన రచయితలంటే వారిద్దరే , మల్లాది, యండమూరి.

మల్లాది నవలల్లో హైదరాబాదు ప్రస్తావన దాదాపు అన్ని నవలల్లో కనపడేది.అప్పట్లో సావిరహే చదివి నేను డంగైపోయాను.నేను కూడా హైదరాబాదు వెళ్ళి అర్జంటుగా ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి షికార్లు కొడుతున్నట్ట్లు ఊహల్లో తేలిపోయేవాడిని. ఛీ ఇంకా ఎన్నాళ్ళీ పేట జీవితం, హైదరాబాదు ఎప్పుడెల్తాను అనిపించేది నాకు. అందుకే నాకు ఇంజనీరింగు సీటు హైదరాబాదు లో వస్తే, సీటు వచ్చినందుకంటే, హైదరాబాదు వెళ్తున్నందుకు చాలా సంతోషం వేసింది నాకు.

అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా, మల్లాది గారి కో నియమం ఉండేది. ఆయన రాసే ప్రతి నవల లో పాత్రల పేర్లు ఏవీ కూడా రిపీట్ కాకూడదు. అంటే అంతకుముందు తను రాసిన ఏ నవల్లోను పెట్టని పేర్లై ఉండాలి. అందుకే ఆయన రచనల్లో కొన్ని పాత్రల పేరు చాలా విచిత్రం గా ఉండేవి. ఆ పేర్లు ఆ పాత్ర స్వభావాన్ని, వయసునీ దృష్టిలో పెట్టుకొని ఎన్నుకున్నట్టే ఉంటుంది కానీ , అసహజం గా ఏమాత్రం ఉండేవి కావు. యండమూరి లా భావుకత ని పండించక పోయినా, చాలా సింపుల్ గా, ఒక సన్నివేశం తరువాత మరొక సన్నివేశం , అలా అలా .. నవలంతా కళ్ళముందు జరిగిపోతున్న సినిమాలా ఉండేదే తప్ప, ఒక నవల చదువుతున్నట్టు ఏమాత్రం ఉండేది కాదు నాకు. నాకు డైరీ రాసే అలవాటున్నప్పుడు, ఏదో ఒక డైరీ వెనక పేజీ లో మల్లాది పాత్రల పేర్లు అని హెడ్డింగు పెట్టి నాకు గుర్తున్న పేర్లన్నీ రాసినట్టు గుర్తు. యెర్రంశెట్టి హాస్యం అన్నా నాకు చాలా ఇష్టం. ఆయన ఒక కాలనీ ని ఆధారంగా చేసుకొని రాసిన కధలు చాలా బావుండేవి(అది నిర్భయ్ నగర్ కాలనీ నేనా?). శాయి గారు అంతకుముందు సీరియస్ గా ఉండే రచనలు చేసారనుకుంటా. కార్నర్ సీట్ అని ఒక చిన్న నవల ఈయనదే చదివినట్టు గుర్తు.(రచయిత ఆయన కాకపోతే సరిదిద్దండేం?).

వార , మాస పత్రికలూ తెగ చదివేవాడిని. నాకు గుర్తుండి నేను చదివిన మొట్టమొదటి కధ "ప్రిస్టేజ్" అని అంధ్ర సచిత్ర వార పత్రిక లోనిది. నవలలు ఎంత ఇష్టం గా చదివేవాడినో పత్రికల్లో కధలు కూడా అంతే ఇష్టం గా చదివేవాడిని. ఇప్పుడెలా ఉందో తెలీదు ,చదవటం మానేసాను గాని,అప్పట్లో నా అభిమాన వార పత్రిక అంటే అంధ్రభూమి. కొన్న రెండు గంటల్లో మొత్తం చదివిపారేసి నిట్టూర్చేవాడిని అప్పుడే అయిపోయిందే అని. మొత్తం చదివేయక పోతే ఒక రెండు కధలో సీరియల్సో రేపటికి మిగుల్చుకుంటే బాగుండేది కదా అనుకొనేవాడిని. ఆతర్వాత కొన్ని సంవత్సరాలకు అదే ఆంధ్రభూమి కారణంగా నాకు కధల మీద ఆసక్తి పోయింది. ప్రతిభ ఏమాత్రం లేని కొత్త రచయితల కధలు ప్రచురిత మవటం ప్రారంభమయింది. కొన్ని కధలైతే అసలిది కధేనా అనిపించేటంత. డబ్బులిచ్చి వేయించు కున్నట్లుంది అనే కొన్ని వాఖ్యలు వినపడినా నాకైతే అందులో నిజమెంతుందో తెలీదు. ఆ రోజుల్లో నేను క్రమం తప్పకుండా చదివిన మరికొన్ని పత్రికలు అంటే అంధ్ర జ్యోతి, అంధ్ర ప్రభ, రచన,మిసిమి ( ఇందులో కొన్ని వ్యాసాల స్థాయి ఎలా ఉంటుందంటే నాకసలు అర్ధమయేవి కావు, బహుశా యిప్పటికీ కూడా). ఇంకా మరికొన్ని ఉండేవి గాని పేర్లు గుర్తు రావటం లేదు. సినిమా పత్రికల్లో సితార, జ్యోతిచిత్ర క్రమం తప్పకుండా చదివేవాడిని. మహానటి సావిత్రి చనిపోయినప్పుడు "రాలిపోయిన తార" అని హెడ్డింగు పెట్టి రాసారు జ్యోతిచిత్రలో(అనుకుంటా). అప్పటికి నేనింకా చాలా చిన్నపిల్లోడిని, నాకు సావిత్రి తెలీదు. అందరూ "అయ్యో" అంటూ చదువుతుంటే, నేను యధాలాపంగా ఆపేజీ చూసానంతే.

ఈనాడు ఆదివారం సంచికలో వచ్చే కధ అంటే నాకు చాలా క్రేజ్. నేను ఇంజనీరింగు చదివే రోజుల్లో నేను సైతం అని ఒక కధ రాసి ఈనాడు లో పనిచేసే మా పిన్ని ద్వారా పంపిస్తే చలసాని వారు బహు మర్యాదగా దాన్ని తిప్పి పంపిం"చేరు". దాంతో మా పిన్ని అప్పటి అంధ్ర ప్రభ ఏడిటర్ గా ఉన్న వాకాటి వారి వద్దకి పంపిస్తా, వెళ్ళి, మాట్లాడి, రాయడం లో కొన్ని కిటుకులు తెలుసుకోమంటే, కధ రిజక్ట్ అయిన బాధలో నేను ఆమెతో "ఊ" అన్నా, నాతోనేను "ఊహూ" అనుకొని బయటకొచ్చేసాను. అప్పటి కధని కొన్నేళ్ళ తరువాత తిరిగి చదువుకుంటే , ఆ రోజు వాకాటి వారి వద్దకు వెళ్ళకుండా మంచి పని చేసాననిపించింది. పెద్దమనిషి కర్రుచ్చుకొని వెంటపడిఉండేవారు. దాదాపు ఒక నాలుగైదు యేళ్ళపాటు ఈనాడు ఆదివారం సంచిక లో వచ్చే కధలన్నీ చింపి ఒక చిన్న పుస్తకం లా కుట్టుకున్నాను. కొన్ని కధలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేను. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు దుమ్ము దులిపి ఒక లుక్కేయాలి దానిమీద.

ఇంజనీరింగు లోకొచ్చాక కూడా మొదటి మూడేళ్ళు బానే చదివాననుకుంటా. అప్పట్లో నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కి వెళ్ళేవాడిని రెగ్యులర్ గా. మా కాలేజేమో గండిపేట్లో.లైబ్రరీ ఏమో అఫ్జల్ గంజ్ లో. శనాదివారాలు పొద్దునే బయలుదేరి లైబ్రరీ కి వచ్చేవాడిని. వచ్చేసరికి ఎంతలేదన్నా పదీ పదకొండయ్యేది, ఒక గంట చదవగానే ఆకలి. ఇంకొక రెండు గంటలు కాగానే ఇంక బయల్దేరాలీ అనే తొందర. ఇంట్లో డబ్బులమీద ఆధార పడ్డ ఆరోజుల్లో హాస్టల్ లంచ్ త్యాగం చేసి బయటతినాలంటే కొద్దిగా ఆలొచించాల్సొచ్చేది.అలా అక్కడ నాకు తిలక్,బలివాడ,శీలా వీర్రాజు,కొ.కు,రంగ నాయకమ్మ, అక్కిరాజు (మంజు శ్రీ),భరాగో, ఇంకా చాలా మంది పరిచమయ్యారు. ముఖ్యం గా కొ.కు గారు. ఆయన రచనలు చదుతుంటే , చదువుతున్నత సేపూ కోపం వచ్చేది నామీద నాకే. ఈయన రచనలు నా దృష్టి కి మరీ ఇంత లేటు గా వచ్చాయేమిటి అని. రంగనాయకమ్మ గారి రచనలు చదివాక నాకు అప్పటివరకు ఉండే ఆలోచనల్లో సమూలమైన మార్పు వచ్చింది. "బడు" పద ప్రయోగం మీద, "వాడుక భాష" గురించి ఆమె రాసిన వ్యాసాలు చాలా ఆసక్తి గా చదివాను.ఆ తరువాత నా మకాం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ కి మార్చాను.అప్పటి తిరుగుడు అంతా సిటీ బస్సుల్లోనే కదా. ఈ లైబ్రరీ ఎలా ఉండేదంటే ఎటువైపు బస్సు దిగినా బాగా లోపలికి నడవాలి. దానికి తోడు ఆరూట్లో బస్సులు తక్కువ. ఇంత కష్టపడ్డా ఇక్కడేమి చదివానో గుర్తు లేదు గాని, రిఫరెన్సు విభాగంలో పదిహేను ఇరవైయేళ్ళ నాటి "ఈనాడు" పేపర్లు నెలలవారీగా బైండు కట్టి ఉండేవి, వాటిని తెగ చదివేవాడిని. ముఖ్యంగా ఆదివారం నాటి పేపర్లని.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి సాహితీ కాలం "చేరాతలు". ఆ తరువాత ఏపేపరు చదివినా సాహిత్యానికి సంబంధించిన పేజీ లని శ్రద్ద గా చదివేవాడిని. ఇప్పటికీ నాకు కొన్ని అర్ధం కావు. అందుకే నా స్థాయి మీద నాకెప్పుడూ న్యూనతా భావమే. ఇంకొంచెం ఎక్కువ చదివి ఉండాల్సింది అనే ఆలోచనే..

పెళ్ళి చేసుకొని మొదటి సారి ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నా, నాలుగు సూట్కేసులు గదా, ఈసారి ఇండియా వెళ్ళినప్పుడూ ఒక సూట్కేసు నిండా నాకు నచ్చిన పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకోవాలి అని. అలానే ఒకరొజు మా ఆవిడ కళ్ళుగప్పి అబిడ్స్ విశాలాంధ్ర బుక్ హవుసు కెళ్ళి నాకు నచ్చిన పుస్తకాలు చాలా కొన్నా. నండూరి వారి విశ్వదర్శనం రెండు సంపుటాలు, తిలక్ కధలు, మునిపల్లె రాజు జర్నలిజం లో సృజనరాగాలు, అక్కిరాజు గారి సాహితీ వ్యాసంగం, భరాగొ ఇట్లు మీ విధేయుడు, నవీన్ అంపశయ్య, డి.వి నరసరాజు గారి ఆత్మ కధ, మహానటి సావిత్రి జీవిత చరిత్ర, భానుమతి గారి నాలో నేను.. మరికొన్ని. ఇంటి కొచ్చాక వాటన్నిటినీ తూకం వేస్తే గుండే గుభేలు మంది. నిజంగానే ఒక సూటుకేసు కి అవే సరిపోతాయ్. అవన్నీ ఒక సూటుకేసు లో సర్ది, పైన బట్టలు పెట్టా అనుమానం రాకుండా. "రాజభవనం అంతా తిరుగు, ఆ గది తలుపు మాత్రం తియ్యకు" అని అదేదో జానపద కధలో రాకుమారిడికి చెప్పినట్లు నేను తనకి చెప్పాను, ఆ సూట్కేసు తీయకు అందులో ఉన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు, అవి గనక పోతే ఇక అంతే సంగతులు అని. ఇంకా నమ్మకం కుదరక ఆ సూట్కేసు ని మా బెడ్రూం మంచం కింద లోపలికి అందకుండా తోసేసా. మొతానికి కధ సుఖాంతమే అయింది "నేను అమెరికా వచ్చేదాకా". ఆమాత్రం రిస్కు తీసుకోకపోతే నాకు మిగిలేది ఇంకో రెండు శిల్పారామం , తరుణి షాపింగులూ , ఇంకో రెండు రకాల పచ్చళ్ళు, మరి కొన్ని తపేలాలూ, గిన్నెలూనూ . ఇంట్లో ఇప్పటికీ తను గుర్రు గా చూస్తుంది ఆ పుస్తకాల వంక.

నాకు బాగా తెలుసు నాదంతా వానాకాలం చదువే అని. ఇక్కడికొచ్చేక ఆ మాత్రం చదువు కూడా లేదు. ఎలాగైనా రెండో ఇన్నింగ్స్ మొదలేట్టాలి. అన్నిటికంటే ముందు ఇప్పటివరకూ చదివిన సిలబస్ ని ఇంకోసారి తిరగెయ్యాలి..

Friday, October 31, 2008

మరచి పోయిన మొదటి జ్ఞాపకం.

ఈ బ్లాగు రాయడం మీద ఇష్టం నాకు రోజురోజుకీ పెరిగి పోతోంది. వచ్చిన ప్రతి ఆలోచననూ ఒడిసిపట్టుకొని దాన్ని బ్లాగులో పెట్టొచ్చా లేదా అని అలోచిస్తూంటే, చివరికి దాన్ని రాసినా రాయకపోయినా, ఆ ఆలోచన మాత్రం నన్ను నేను మరలా మరొక్కసారి తరచి చూసుకొనే అవకాశాన్ని కలిగిస్తోంది. ఏదో పరాకు లో ఉన్నప్పుడో, డ్రైవ్ చేస్తున్నప్పుడో ఎన్నో ఆలోచనలు. ఒకప్పుడు అవి చాలా వరకు అలా వచ్చి ఇలా వెళ్ళేవే. బ్లాగు పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఆలోచనని మధిస్తుంటే నాకు బ్లాగు రాయడానికి మించిన ఆనందం కలుగుతోంది. ఎన్నో జ్ఞాపకాలు, తారసపడే ఎందరో వ్యక్తులు, ఎక్కడో మొదలయ్యే జీవితం. చాలా దూరం వచ్చామని తెలుస్తుంది గాని ఎంతదూరం వచ్చామో తెలీదు, ఇంకెంత దూరం ఉందో అంతకంటే తెలీదు.

నా చిన్నప్పుడు మా అమ్మకంటే ముందు మా బాగోగులు చూసిన వ్యక్తి ఒకరున్నారు. ఆమే మా అవ్వ. మా నానమ్మ వాళ్ళమ్మ. నేను పుట్టే టప్పటికే తనకి దాదాపు ఎనభై యేళ్ళుంటాయేమో. అప్పటికే ఆమెకి ఏదో వ్యాధి వచ్చి నడుం వంగిపోయింది. నడుము నుంచి మొహం వరకు నేలకు సమాతరం గా ఉంచి నడిచేది. మేము తనముందే ఆమెలా నడిచి ఆమెను ఆట పట్టించేవాళ్ళం. మేము ఆట పట్టిస్తున్నా కూడా చిర్నవ్వు తో అలా మమ్మల్ని చూస్తూ మురిసిపోయేది. కోపం అనేది తన మొహంలో చూసి ఎరగను నేను. చిన్నతనం, తెలిసీ తెలియని వయసు. అయినా నాకెందుకో ఇప్పుడు ఆమెనలా ఆటపట్టించటం గుర్తుకువస్తే ఏదో క్షమార్హం కాని నేరం చేసాననిపిస్తోంది. ఆమెకి మేమే లోకం. మా బాగోగులే ఆమెకి దినచర్య. మా నలుగురు పిల్లలకి స్నానాలు చేయించటం, బట్టలు తొడగడం, అన్నం తినిపించటం, మాతో ఆడుకోవడం ఇవే ఆమె ప్రధాన వ్యాపకాలు.

భోజనాల దగ్గర అవ్వను నేను తెగ విసిగించేవాడిని. చెప్పాను కదా ఆమె అలా వంగి నడుస్తూ ఉంటే నేనువింతగా చూసే వాడినని. మా భోజనాల గది వంటిల్లు వేరు వేరు గా ఉండేవి.నేను మొదట అవ్వా పప్పు కావాలి అనేవాడిని, అది తేగానే ఈసారి నెయ్యి, ఆ తరువాత ఇంకేదో. ఇలా అన్నీ ఒక్కసారే అడగకుండా ఆమెని ముప్పు తిప్పలు పెట్టేవాడిని. ప్రతిసారి ఆమె నేనడిగింది తేవటానికి వెనక్కి మళ్ళగానే నేను ఎక్కిరింతగా నవ్వుతూ మిగతా పిల్లలకి చూపించి నవ్వేవాడిని ఎలా నడుస్తోందో చూడండి అని. నేనడిగిన ప్రతిసారి విసుక్కోకుండా పాపం రెండు గడపలు దాటి మరీ వెళ్ళి తీసుకొచ్చేది.గడప దాటడం చాలా కష్టం ఆమెకి, పైగా అవి ఎత్తు గడపలు.రెండు చేతులతో ద్వారం తాలూకు నిలువు బద్ద ని పట్టుకొని ఆ ఊతంతో దాటాల్సొచ్చేది.

నాకు నాలుగైదేళ్ళున్నప్పుడే తను చనిపోయింది. మా ఇంటి పంచలో ఉంచారు ఆమె నిర్జీవ శరీరాన్ని. నాకేమాత్రం ఏడుపు రాలేదు. అలా వింతగా చూస్తూ ఉన్నానంతే. నాకు మూడు పూటలా అన్నం పెట్టి, నా ఆలనా పాలనా చూసిన ఆ చెయ్యి అలా నిర్జీవం గా పడి ఉంటే నాకేమాత్రం కనీసం దిగులు కూడా అనిపించలేదు. ఏదో జరిగిందని తెలుసు, ఏమిటో తెలీదు.
అందరిపిల్లల్లొకి ఆమెకి నేనంటే ఎక్కువ ఇష్టమట. తను చనిపోయిన తరువాత కూడ నేను నాకు అవ్వే అన్నం పెట్టాలి అని ఏడుస్తుంటే మావాళ్ళు భయపడి ఏవో పూజలు పునస్కారాలు చేసారట.

మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్న ని అడిగాను అవ్వతాలూకు ఫోటో ఎక్కడైనా దొరుకుతుందా అని. నా ఆశ అడియాశే అయ్యింది. మా బంధువుల ఇళ్ళళ్ళో ఉండే అవకాశం కూడా లేదంట.

మరణానంతరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు కదా. తను మరలా ఎక్కడైనా పుట్టిందో తెలీదు, లేదా పైన వుండి నన్ను అలా విస్తుపోతూ చూస్తూ ఉందో తెలీదు. ఈ ఒక్కమాట చెప్పాలని ఉంది. నిన్ను మర్చిపోయినా, పూర్తిగా మాత్రం మర్చిపోలేదు, అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటావూ అని చెప్పాలని ఉంది.

ఈ ఉరుకులు పరుగులు ఎందాకో , ఏమి సాధిద్దామనో తెలీదు గానీ , ఈ పరుగుపందెం లో నేను మరచిపోయిన నా మొట్టమొదటి జ్ఞాపకం మా అవ్వ.

Sunday, October 19, 2008

మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా?నిన్న రాత్రి ఒంటిగంటప్పుడు ఆఫీసు సెల్ ఫోను కార్లోనే మర్చిపోయిన విషయం గుర్తొచ్చి, కిందకొచ్చి దాన్ని తీసుకొని, లోపలికి రాబోతూ ఒక్కసారి తల పైకెత్తి చూసాను. ఆ నిశీధి వేళ నల్లటి ఆకాశం, ఒక పక్క పున్నమి చంద్రుడు, చాలా మనోహరం గా ఉందా దృశ్యం. కాసేపలా చూస్తూ ఉండిపోయా..
*****************************************************************

నా చిన్నప్పుడు వేసవొచ్చిందంటే రాత్రుళ్ళు మిద్దేమీదే పడక. గుంటూరు జిల్లా ఎండల గురించి మీకు తెలుసుగా?వేసవి ఉక్కపోత ఎంత ఇబ్బందికరం గా ఉంటుందంటే పిల్లలందరం రాత్రి ఏడు కాగానే అన్నం తినేసి ఎప్పుడు మేడ మీదకెళ్ళి మాటలు చెప్పుకుంటూ పడుకుందామా అని ఆత్ర పడేవాళ్ళం. పడుకొని అలా ఆకాశాన్ని, ఆ నక్షత్రాలను, ఆ మసక చీకటిలో అప్పుడప్పుడు మా మీదగా ఎగిరిపోయే కొంగలగుంపునూ చూస్తూ, మాటలు చెప్పుకుంటూ , ఎప్పటికో నిద్ర పోయేవాళ్ళం. మేమే కాదు, మా పక్కింట్లో అద్దె కుండేవాళ్ళు, ఆ పక్క పెంకుటింట్లో ఉండేవాళ్ళు అందరమూ కలిపి ఒక పెద్ద గుంపు తయరయ్యేది మా మేడ మీద. పిల్లలొక గుంపు, పెద్దలొక గుంపు. ఏ గ్రూపు మాటలు వాళ్ళవే. ఇక పడుకోండ్రా అని పెద్దలు కసరందే మా మాటల కంతుండేది కాదు. వాళ్ళు కసరగానే మేమందరం పిండ్రాప్ సైలెన్స్. మరలా నెమ్మదిగా మా పిల్లల్లో ఎవరో మాటలు మొదలెట్టే వారు, మళ్ళా మాటలు. నాకప్పుడు ఐదారేళ్ళుంటాయేమో. నిద్ర మధ్యలో ఎప్పుడైనా లేచి కళ్ళు తెరిచి చూస్తే, పడుకోపోయే ముందు నా కాళ్ళ వైపు ఉన్న చందమామ నా నడి నెత్తి మీదో, ఇంకాస్త ఆ పైకో ఉండేవాడు. భలే విచిత్రం గా అనిపించేది. మా అన్నయ్యని అడిగినట్టు గుర్తు ఎందుకలా అని. తనేం చెప్పాడో నాకు గుర్తు లేదు. వాడూ చిన్నోడేగా, ఏదో తింగరి సమాధానం చెప్పేఉంటాడు. ఎప్పుడైనా ఆరింటికో ఆరున్నరకో మెలకువస్తే ఆ కాశంలో ఒకపక్క చంద్రుడు, ఇంకోపక్క సూర్యుడు. నాకదొక వింత. కనీసం పదిమందికి చూపించందే మనసూరుకునేది కాదు.

నాకు చిన్నప్పటి నుంచి సైన్సు విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. 1984 లో అనుకుంటా రాకేష్ శర్మ అంతరిక్షం లో అడుగుపెట్టాడు, భారతదేశం తరపున మొదటి వ్యోమగామిగా. TV లో చూసా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి రాకేష్ శర్మ తో మాట్లాడడం. దాన్ని చూసినప్పటి నుండి రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడల్లా నక్షత్రాలు , చందమామ లను మించి ఆవల ఏముంది అని అలోచించేవాడిని. అన్నయ్య నడిగితే అంతరిక్షం కి అంతే లేదన్నాడు, పోతూ ఉంటే అలా అలా వస్తూ ఉంటుందట. మన లాంటి పాలపుంతలు ఎన్నో లక్షలు కోట్లు ఉన్నాయట.ఆకాశాన్ని చూస్తూ ఈ విశ్వం అనంతం అనే సత్యాన్ని తలచుకుంటూ అసలు అదెలా సాధ్యం అంటు తెగ ఆశ్చర్య పడేవాడిని. (నా బ్లాగు పేరు వెనకున్న కధ ఇదే). ఆ Infinity అనే కాన్సెప్ట్ నాకిప్పటికీ ఆశ్చర్యమే.

ఇక ఆ తరువాత చదువుల్లో పడి ఆకాశాన్ని అంతగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు మేడ మీదికొచ్చి ఆరోజు పౌర్ణమి గనక అయితే హాయ్! వెన్నెల ఎంతబాగుందో అనుకునేవాడిని. కరంటు రాగానే కిందకి పరుగు. TV చూడ్డానికో, లేక పోతే చదూకోడానికో.

ఇంజనీరింగ్ లో కొచ్చాక మాది హైదరాబాద్ నగర శివార్ల లో ఉన్న కాలేజి కాబట్టి రోజూ మెస్ లో రాత్రి భోజనం కానిచ్చి వాకింగ్ కి బయలుదేరేవాళ్ళం. అలా వాకింగ్ చేసేటప్పుడూ, నిండు వేసవిలో హాస్టలు రూము లో ఉక్కపోత భరించలేక మంచాలు బయట వేసుకున్నప్పుడూ , అలా ఆకాశం వైపొక లుక్కేసేవాడిని. హైదరాబాదు కొచ్చిన కొత్తల్లో, బిర్లా పానెటోరియం లో, అసలుకి నకలైనా, ఆకాశాన్ని చూసినప్పుడు చిన్నప్పటి సంగతులు కొన్ని గుర్తొచ్చాయి.

ఆ తరువాత ఉద్యోగాన్వేషణలో ముందు చూపే గాని బొత్తిగా పైచూపు లేకుండా పొయింది. దానికి తోడు అపార్ట్మెంట్ బతుకయిపోవటం మూలాన అదొకటుందన్న ఊహ కూడా కరువైపోయింది. ఒక ఐదేళ్ళ క్రితం అనుకుంటా మేము ముగ్గురం ఫ్రెండ్స్ మి అప్పటికప్పుడు అనుకొని హైదరాబాదు నుంచి శ్రీశైలం బయలు దేరాము మల్లన్న దర్శనం చేసుకుందామని. దర్శనం అయినతరువాత ఎవరో చెప్పారు ఒకటైము తరువాత అటవీశాఖ వారు వాహనాల్ని అడవిలోకి అనుమతించరని. అప్పటికప్పుడు రేడీ అయ్యి బయలుదేరాము తిరిగి హైదరాబాదు కి . చెక్ పోస్టు దాటి అడవి లోపలికొచ్చాక ఎందుకో కాసేపు కారాపి ఆ చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యలనిపించి కారు దిగాము. చిమ్మ చీకటి. ఎంత దట్టమైన చీకటంటే పక్కనెవరైనా అడుగుదూరం లో నిలబడ్డా పోల్చుకోలేనంత చీకటి. మాట వినపడితే గాని మనపక్కనొకరున్నారన్న సంగతి తేలీదు. తల పైకెత్తి చూసానొకసారి. నాకళ్ళని నేనే నమ్మలేకపొయాను. నల్లటి ఆకాశంలో పైన ఎన్ని లక్షల నక్షత్రాలో. ఇప్పటికీ ఆదృశ్యం నా బుర్రలో భద్రం. చాలా అందమైన అనుభవం నాకది. హైదరాబాదు లో అన్ని నక్షత్రాలు కనపడవు.

ఆతరువాత , ఒక రెండేళ్ళ క్రితం మా అన్నయ్య అమెరికా నుంచి తెప్పించిన టెలీస్కోపు ని పిల్లలకి చూపిద్దామని పిల్లలనందరిని పోగేసాడు మా అపార్ట్ మెంట్ బాల్కనీలొ . పనిలో పని గా నేనుకూడ మైమరచి పోయాను ఆ చంద్రుని మీది గుంతల్ల్నీ (క్రేటర్స్), శని గ్రహం చుట్టూ ఉన్న వలయాల్నీ చూసి. ఇక పిల్లలందరూ వంతులవారీ గా చూస్తుండగా, ఇంకేమైనా పెద్ద నక్షత్రాలు, టెలీస్కోపు లో చూడదగ్గవి కనపడతాయేమో చూద్దామని ఆ వైపుకి వెళ్ళి అలా అలా వంగి చూడబోయాను. మావదిన అప్పుడే బట్టలుతికినట్టుంది , నేల తడి గాఉండి కాళ్ళ కింద పట్టు తప్పింది. ఎలా తమాయించుకున్ననో నాకు తెలీదు గాని, నిజం చెప్తున్నా, ఆ గుండె దడ ఇప్పటికీ తగ్గలేదు.

ఇక్కడ అమెరికా వచ్చిన కొత్తల్లో ఒహాయో లో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ కి బాల్కనీ ఉండేది. అప్పుడప్పుడు అలా వచ్చి కూర్చొని ఆకాశం వైపు చూసినా ఆ ఆలోచనలు కొద్దిగా భిన్నం గా ఉండేవి. రేపు వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం వచ్చే సూచన ఉందా?, నా రైన్ కోటు ఇంట్లో ఉందా , లేక కార్లో ఉందా? ఇట్లాంటివన్నమాట. ఏంచేస్తాం, స్థాన మహిమ.

ఆతరువాత నేను మారిన అపార్ట్ మెంటుల్లో ఒక్కదానికి కూడా బాల్కనీ లేదు. పడుకోబోయే ముందు లైట్లార్పినప్పుడు కిటికీలోంచి పున్నమి చంద్రుడు హాయ్ అన్నాకూడా నాకిప్పుడు లేచి కిటికిదగ్గరికెళ్ళీ ఆ బ్లైండ్స్ పైకి లేపి , ఆ గ్లాసు తలుపు పక్కకి జరిపి , తల బైటికి పెట్టి ఆస్వాదించే ఓపిక లేదు.

ఏతావాతా పైన చెప్పిన రెండుమూడు సందర్భాలను మినహాయిస్తే గత ఇరవై యేళ్ళు గా ఆకాశానికి నాకు బొత్తిగా మాటల్లేవ్. బిజీ లైఫ్ కదా.దానికి తోడు ఆ! నా నెత్తినే ఉండేడ్చింది కదా ఎక్కడికి పోతుందిలే అనే కొద్దిపాటి నిర్లక్ష్యం.
సరే మళ్ళీ మీకదే ప్రశ్న. మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

Sunday, September 28, 2008

చిన్నప్పటి స్కూలు, గుర్తుందా అసలు?

చిన్నప్పుడు చదువుకున్న స్కూలంటే మనలో చాలా మందికి ఎంతో ఇష్టం అనుకుంటాను. అయితే మీ చిన్నప్పుడు చదువుకున్న స్కూలుని మీరు చివరిసారి చూసి ఎన్ని రోజులైందీ? ఆటలు, పాటలు, స్నేహం, చదువు, తగువులూ, కొట్లాటలు, పరీక్షలు , గెలుపు-ఓటమి ఇత్యాదివన్నీ మనకు పరిచయం అయిది అక్కడేగా? నేను మాఊరు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారీ అనుకుంటాను చూడాలని. పోయినసారి మాఊరు వెళ్ళినప్పుడు చూసాను. అప్పటికి ఇరవై యేళ్ళు నేను ఆ స్కూలు నుంచి బయటికి వచ్చి. నాకైతే చాలా బాధ వేసింది దాన్ని చూడగానే. నేను చదివేటప్పుడు మావూర్లో అదే ప్రధాన పాఠశాల. ఇంకొక చిన్న స్కూలు, క్రైస్తవ మిషనరీ ద్వారా నడిచే కాన్వెంట్ ఉన్నా కూడా ఈ స్కూలుతో పోలిస్తే అవో లెక్కలోకి రావు. దాదాపు రెండువేల మంది విద్యార్ధులతో కళ కళ లాడుతూ ఉండెది. గత యిరవై ఏళ్ళలో ఎన్నోమార్పులు. విద్య వ్యాపారమై వీధికో స్కూలు వెలిసాయి. తెలుగు భాష, తెలుగు మీడియం మీద ఉన్న చిన్న చూపు నా స్కూలునో చూపు చూసాయి. ఇంకేముంది విధ్యార్ధుల సంఖ్య ఎంత పడిపొయిందంటే దాదాపు స్కూలు మూతపడిపొయేంత. ఒకప్పుడు గర్వంగా చెప్పుకొనే స్కూలు కాస్త ఇప్పుడు అయ్యో ఆ స్కూలా, ఏదైనా మంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళో జేర్పించొచ్చుగా అనేలా మారిపొయింది పరిస్తితి. విధ్యార్ధులు లేక , స్కూలు ముందు భాగంలో, మెయిన్ రోడ్డు నానుకొని ఉన్న తరగతి గదుల్ని పడెసి షాపులు కట్టి అద్దెకిచ్చేసారు. అంతకు ముందు నా ఏడవతరగతి క్లాసులు అక్కడె జరిగేవి. ఈ స్కూలు పరిస్థితే ఇలా ఉంది అంటే, బహుశా నేను ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదివిన స్కూలు ఈపాటికి శిధిలమై ఉండవచ్చు లేదా ఈపాటికి అక్కడొక బ్రహ్మాండమైన భవనం లేచినా లేచి ఉండవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ రెండు స్కూళ్ళకు వెళ్ళి కొన్ని ఫొటోలు తీసుకోవాలి అవి శాశ్వతం గా అదృశ్యమయ్యేలోపు.
సరే ఇంతకీ నేను చెప్పదలచుకుందేమంటె, ఈసారి మీరు మీ ఊరెళ్ళినప్పుడు మీ బాల్యానికి చిరునామాల్లాంటి మీరు చదివిన స్కూళ్ళని ఒకసారి చూసుకొని రండి. మరలా ఒక్కసారి ఆ జ్ఞాపకాల్ని తలుచుకొని తడిసి ముద్దవ్వండి.ఏమంటారు?

Tuesday, September 16, 2008

నా రేడియో పోయింది, వెతికి పెట్టరూ! ప్లీజ్

మార్పు సహజం.

"అన్నీమారిపోతున్నాయ్ , ఒకప్పుడలా ఉండేది, ఇప్పుడలా లేదు ....." అని గింజు కోవటం అంతకన్నా సహజం.

అలాంటి ఒక గింజులాటే ఇది. వినండి.
********************************************************************************************
మనలో చాలామంది కి ఎంతో ఇష్టమైనది బాల్యం. ఏ బాదరబందీ లేకుండా, ఏటికి ఆవల ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం అస్సలు లేకుండా , ఆటలూ -పాటలూ,కాస్త పెరిగాక బడి, పుస్తకాలు,పండగలు-పబ్బాలు , కొత్త చొక్కాలు , కొద్దిగా ఊహ తెలిసాక సినిమాలు, కధల పుస్తకాలు, వేసవి సెలవులు ... ఎవరికిష్టం ఉండదు? నావరకు నాకు , నేను పోగొట్టుకున్నాను అనే వాటిల్లో బాల్యం ఎంత ముందుంటుందొ ,"మార్పు" అనేది స్ఫురణ కి రాగానే నాకు అంతే ముందు గా గుర్తుకొచ్చేది రేడియో. అది వింటూనే పెరిగి పెద్దయ్యాను నేను. ఇప్పుడేమో గాని ఓ పాతికేళ్ళ క్రితం రేడియో మోగని ఇల్లంటూ ఉండేది కాదేమో. అన్నీ గుర్తే ఇప్పటికీ . జనరంజని, కార్మికుల కార్యక్రమం, క్విజ్ ప్రోగ్రాములూ, ఏక చిత్ర గీతాలూ, రొజూ పొద్దున్నే వచ్చే ఢిల్లీ వార్తలూ, ప్రాంతీయ వార్తలూ.., ఆదివారం మధ్యాహ్నం నాటి నాటకాలు, శనివారం నాటి సుప్రభాతం, చెప్పుకుంటూపోతే ఎన్నో. సినిమాలకి నేపధ్య సంగీతం ఉన్నట్లే నా బాల్యానికి నేపధ్య సంగీతం నేను విన్న రేడియో. పొద్దున్నే తొమ్మిది గంటలప్పుడు బడికి వెళ్తుంటే దార్లో జనరంజని వినపడని ఇల్లుండదంటే అతిశయోక్తి కాదు. అప్పటి నా రేడియో పరిజ్ఞానం ఎలా ఉండేదంటే జనరంజని పాటల మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనలను బట్టి టైము ఎంతైందో చెప్పగలిగే వాడిని. కాల్గేట్ ప్రకటన వినపడగానే గడియారం వంక కూడా చూడకుండా "అమ్మా! టైము తొమ్మిదింబావు" అంటూ బాత్రూం లోకి పరిగెత్తే వాడిని స్నానం చేయడానికి. జనరంజని లో ఫలానా పాటని ఫలానా వాళ్లు కోరారు అంటూ చేంతాడంత లిస్టు చదివేవారు. అది నాకిష్టమైన పాట ఐతే విసుగు పుట్టేది. ఎంతకీ ఆ లిస్టు పూర్తికాదే... ఇప్పడు మర్చిపోయాను గాని, కొన్ని ఊళ్ళ పేర్లు తెగ రిపీట్ అయ్యేవి. నా సినీ పరిజ్ఞానానికి మొదటి మెట్టు కూడా రేడియో నేమో. సంగీత దర్శకుడు, గీత రచయితల పేర్లు చెప్పగానే అది ఏ పాటో పందేలు కాసేవాళ్ళం మేం నలుగురు పిల్లలం. మధ్యాహ్నం ఐతే భోజనానికి ఇంటికి వచ్చేటప్పుడు కార్మికుల కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ముందు వచ్చే ఆ సంగీతం వద్దన్నా చెవిలోపడేవి . మర్చే పోయాను , శ్రీరామనవమి సందర్భం గా భద్రాచలం నుంచి శ్రీరాముని కళ్యాణ విశేషాలను వినని శ్రీరామనవమి లేదు నా బాల్యం లో. బహుశా "ప్రత్యక్ష ప్రసారం "అనే పదం నా డిక్షనరీ లో నమోదు అయింది అప్పుడే అనుకుంటాను. స్కూల్లో ఉన్నాకూడా స్కూలు పక్కన ఉన్న ఇళ్ళలోంచి లీలగా వినపడుతూ ఉండేది రేడియో సంగీతం. మా ఇంటికి దగ్గర్లొనే ఒక మునిసిపాలిటీ పార్కు ఉండేది. రొజూ సాయంత్రం ఆరు కాగానే పార్కు లొ ఉన్న మైకు ద్వారా రేడియో వార్తలు ప్రసారం చెసేవారు. ఆసక్తి ఉన్నవారు ఆ మైకు కి దగ్గరగా వచ్చి వినేవారు. ఆరు కాగానే కాస్త కలకలం గా ఉన్న పార్కు లొ విచిత్రమైన నిశ్శబ్దం రాజ్యమేలెది. ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకులు చనిపోతే నిజం చెప్పొద్దూ భలే బోరు కొట్టేది. మొదటి మూడు రోజులూ విషాద సంగీతం రోజంతా. ఆ తరువాత భక్తి పాటలూనూ. పండగలోస్తే ఆ పండగ ప్రాశస్త్యం ని బట్టి ఆయా దేవుళ్ళ పాటలు ముందు వేసేవారు. నా చిన్ని బుర్ర కి తట్టేది కాదు, ఆ పాట కోరేవాళ్ళు కరెక్టు గా ఆ రోజే చేరేట్టుగా రేడియో వాళ్ళకి జాబు ఎలా రాస్తారు అని. లలిత సంగీతం, వాతావరణ హెచ్చరికలూ, బాలానందం ..ఇలా చెప్పాలంటే ఎన్నో...అయ్య బాబోయ్ ఉష శ్రీ గారిని మర్చే పోయాను. లెంపలేసుకుంటున్నా.

ఇక మా ఇంట్లో ఉండే రేడియో గురించి. అది ఎంత పాతది అంటే దాన్ని ఆన్ చేసిన ఏడు సెకన్లకి గాని ఆన్ ఐనట్లు సూచించే లైటు వెలిగేది కాదు. అప్పట్లో నాకది వింతగా ఉండేది. మొన్న ఇండియా వెళ్లి నప్పుడు గుర్తొచ్చి ఇల్లంతా వెతికా. మేము పాత సామాన్లు వేసే గదిలో వంటరిగా పడుంది దుమ్ము కొట్టుకుపోయి. నాకు మాత్రం " విశ్వాస ఘాతకుడా" అని నన్నే చూస్తున్నట్టు అనిపించింది. వెరే ఏవైనా బయట పడేస్తే పడేసారు గాని ఇది మాత్రం జాగ్రత్త అంటుంటే వింతగా చూసాడు నాన్న. అయినా వాళ్ళకది మాములే. నెను ఇండియా కి వచ్చినప్పుడల్లా ఇలా ఏదొ ఒక అపరూపమైన వస్తువు ని వెతికి పట్టుకోవడం, పడేయొద్దు అని జాగ్రత్తలు చెప్పడం. చెప్పాలంటే అదో పెద్ద లిస్టు.

నిజానికి ఈ రేడియో పాత సామాన్ల గది చేరి దాదాపు యిరవై ఏళ్ళ పై మాటే.నేను ఎనిమిదో తరగతిలొ ఉన్నప్పుడనుకుంటాను, మా నాన్న కి నబీ అనే ఒక ముస్లిము స్నెహితుడుండేవాడు . ఆయన వీలు దొరికినప్పుదల్లా సిలోన్ ( శ్రీలంక) వెళ్ళి ఫారిన్ వస్తువులు తెచ్చేవాడు. మేడిన్ హాంకాంగ్ డిజిటల్ వాచీలు,టేప్ రికార్డర్లు, బటన్ నొక్కితే తెరుచుకొనే గొడుగులు లాంటివి. అలా ఆయన ద్వారా మా నాన్న నేషనల్ పేనసోనిక్ వాళ్ళది ఒక రేడియో కం టేప్ రికార్డర్ తెప్పించటం, కొత్త వింత.. పాత రోత.. రీతి లొనే పాతరేడియో ని ఇలా పక్కన పడేయడం జరిగింది. అది స్మగుల్డు వస్తువు కాబట్టి ఆ విషయం తెలిస్తే పోలిసులు వచ్చి దాన్ని తీసుకెళ్తారని ఎవరో చెప్పడం తొ , అది ఎప్పుడు మోగుతున్నా నేను కంగారు కంగారు గా వెళ్ళి వీధి తలుపులు మూయటం ఇంకా గుర్తుంది. మా అమ్మ కి నా కంగారు అర్ధం కావటానికి సంవత్సరం పట్టింది అదీ మా నాన్న చెప్పాకనే.

ఇక నేను పదో తరగతికి రాగానే విషయ పరిజ్ఞానం పట్ల ఆసక్తి కల నాబోటి ఔత్సాహికులకి ఇంగ్లీషు వార్తలు వినటం ఒక "స్టేటస్ సింబల్" అయి కూర్చుండటం మూలాన నా రేడియో పరిధి అమాంతం పెరిగి పొయింది. ఇండియా నే కాదు ఇండియా లాంటి దెశాలు "బోలెడు" ఉన్నాయి అని తెలియటం, తద్వారా BBC, ABC, సిలోన్ రేడియో లాంటివి నా చెతికందాయి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు నేను ఇండియా లొ ఏమి జరిగినా, "టాట్! నేనేంటి నా లెవెలేంటి" అని ఆయా వార్తలు BBC ద్వారా వినెవాడిని. ఇక్కడి వెర్షను ఎలాగూ తెలుసు అక్కడి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అనే దుగ్ధ కూడా ఒక కారణం కావచ్చు.

ఇక ఇంటర్ కి రావడం, మాకు తెలిసిన బంధువర్గం లోని పిల్లలు చాలా మంది అప్పటికే ఇంజనీరింగు చేరి ఉండటం తో, స్థాయీభేదాన్ని జీర్ణించుకొవటం కష్టమై మా నాన్న నాకు "స్ట్రిక్టు వార్నింగు" ఇవ్వటం, ఆ రెండు ఏళ్ళూ చదువే లొకం గా బతకటం, తద్వారా నా రేడియో అటకెక్కడం జరిగిపొయాయి. అప్పుడప్పుడే TV అనే గ్రహాంతర వాసి మనమీద దాడి చెయ్యడం కూడా ఒక కారణం.

ఇక ఇంజనీరింగ్ లొ కొచ్చాక మళ్ళా దుమ్ము దులిపి నా రేడియో ని బయటికి తీసాను. వీడెవడ్రా బాబూ అన్నట్లు చూసి దగ్గేవారు నా రూమ్మేట్లు. ఉండేది అయిదరాబాదు కదా,ఇక హిందీ దురద కూడా అంటుకుంది. నేను రెగ్యులర్ గా వినే వాటితొ పాటు మరి కొన్ని వచ్చి చేరాయి. బినాకా గీత్ మాలా, ఆర్మీ వాళ్ళకుద్దేశించిన పాటల కార్యక్రమం ( పేరు మర్చిపొయా, ఆప్ కి ఫర్మాయిష్???, ఆ పాటలు కోరే వాళ్ళందరు సుబేదార్లే) అలా.

ఎంత రేడియో ప్రేమికుడినైనా, కళ్ళ ముందు కనపడే రంగుల ప్రపంచానికి ఆకర్షితుడనై (ఏదొ అనుకునేరు,TV సంగతి చెప్తున్నా), కొన్నాళ్ళు నా రేడియో ని కొద్దిగా నిర్లక్ష్యం చెసిన మాట వాస్తవం. ఆ రంగుల సుందరి భ్రమలు నెమ్మదిగా తొలగి పొతున్నాయి ఇప్పుడు. ఇప్పటికీ BBC, లోకల్ రేడియో స్టేషన్లు వింటూంటా ఎంత బిజీ గా ఉన్నా. డ్రైవింగ్ చెస్తున్నప్పుడు తప్పనిసరిగా రేడియోనే వింటా, పక్కనున్న నా శ్రీమతొ, వెనక సీట్లొ ఉన్న నా స్నెహితులో నెత్తీ నోరూ బాదుకునే వరకూ. ఇప్పుడు కూడా ఒక పదిమందిమి కలిసి ఎక్కడికైనా వెళితె , అందరూ జంకుతారు నాకారు ఎక్కటానికి. కారు ఎక్కే టైము రాగానె, నా వెనకాలే ఒప్పందాలు జరిగిపొతై నువ్వెళ్ళరా బాబూ అంటె లెదు నువ్వెళ్ళరా అంటూ. కొద్దిపాటి చనువు ఉన్నొళ్ళు నాచేత ఒట్టేయించుకొని ఎక్కుతుంటారు.

మాతృభూమి కి దూరంగా ఉండటం చేత ఇండియాలొ ఈ రేడియో విషయం లొ చోటు చేసుకున్న మార్పులు ఇప్పుడు నాకు అంతగా తెలీదు. FM రేడియో జనాల్ని ఉర్రూతలూగిస్తున్నది అని విన్నాను.ఇండియా కి వెళ్ళినప్పుడు వినాలి. "రంగుల సుందరి" లా ఇది (పై పై) "హంగుల సుందరి" కాకుండా ఉంటే బావుణ్ణు.

ఆలోచిస్తే అనిపిస్తుంది నా చిన్నప్పుడు రేడియోలొ విన్న క్విజ్ ప్రొగ్రాములే నా పఠనాసక్తి కి బీజం వేసాయేమో అని. కనపడిందల్లా చదివేవాడిని అప్పుడు.ఇప్పుడు కూడా. అందుకే రేడియో అంటే నాకు చాలా ఇష్టం.రేడియో తో కూడిన నా చిన్నప్పటి జ్ఞాపకాలంటె .. ఇంకా ఇంకా ఇష్టం.

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం......

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.  (తెలియని వారికి: అమెరికాలో...