తొంభైల చివర వరకూ కొద్దో గొప్పో మన తెలుగు సినిమా పాటలు సాహిత్య పరంగా కూసింత ఆస్వాదించగలిగేలా ఉండేవనుకుంటా.తర్వాత్తరవాత ట్రెండు మారి వాయిద్యాల హోరెక్కువై (ఉన్న కొద్దిపాటి )సాహిత్యాన్ని సంగీతం మింగేయటం మొదలయింది.అయినా ఇప్పుడొస్తున్న కొత్తపాటల్లో కనీసం ఓ రెండులైన్లయినా నచ్చకపోతాయా అన్నట్లు వెతుకుతూ (వింటూ) ఉంటా. 99% నిరాశ పరిచేవే.చాలా పాటలు పూర్తిగా వినే అవసరం కూడా ఉండదు.
అప్పుడెప్పుడో "గమనం" అనే సినిమా ట్రైలరు చూసినప్పుడు పర్లేదు చూడొచ్చేమో అనిపించింది. ఒకానొక ఆదివారం మధ్యాహ్నం చిన్నకునుకు తీసిన తర్వాత లేవటానికి బద్దకించి ఏమైనా చూద్దామని వెతుకుతుంటే ఈ సినిమా యు-ట్యూబ్ లో కనపడింది.ట్రయిలర్ తాలూకు ప్రభావం ఎలానూ ఉంది పైగా ఇప్పటివరకు పేరు వినని దర్శకురాలు (సుజనా రావు ) కాబట్టి ఇంకాస్త ఆసక్తి ఎక్కువైంది. సినిమా కథా,దర్శకత్వం లాంటి మిగతా వివరాల జోలికి పోను గాని సినిమా నాకైతే పర్లేదనిపించింది.పైగా ఈ సినిమా నేపధ్యం నా కెం ........ తో......... ఇష్టమైన హైదరాబాదు కాబట్టి ఇంకాస్త ఎక్కువ నచ్చిందన్నమాట.
ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో "ఎంత ఎంత చూసినా " పాట బావుంటుంది. ఆకట్టుకునే బాణీ,మంచి సాహిత్యం. పైగా పైన చెప్పినట్టు నేపధ్యం హైదరాబాదు.ఇంకేం కావాలి మరి నాకు?
ఈ పాటలో యవ్వనంలో ఇద్దరి మధ్య ఆకర్షణ ఎంత ఉధృతంగా ఉంటుందో చెప్తూ "నీడ కూడా రంగుమారే ప్రాయమే ఇది" అనే లైను మొదటిసారి విన్నప్పుడు నాకు భలే నచ్చేసింది.రాజా గారు పాటని ఇంకొంచెం హుషారుగా పాడించి ఉంటే ఇంకా బాగుండేదేమో మరి. పాట రచన కృష్ణకాంత్.
నాకు నచ్చిన ఇంకో పాట ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్లిందో తెలీని "అర్ధశతాబ్దం" సినిమాలోని "ఏ కన్నులూ చూడనీ చిత్రమే".సాహిత్యంతో పాటు పాట చిత్రీకరణ కూడా ఆకట్టుకునేలా ఉంది. (పిడకల వేట : ఈ పాటలో హీరో(?)పైనుంచి పూలు విసిరే సీన్లో కంటిన్యుటీ మిస్సయింది. కోతి గురించి మాత్రం ఆలోచించొద్దు అనగానే ఆలోచనలనిండా కోతే నిండిపోయినట్టు,నాకు ఈ పాట చూస్తున్నంతసేపు అదే గుర్తుకొస్తుంది : )
పాటలో నాకు బాగా నచ్చిన లైన్లు..
రంగులద్దుకున్న... సందె పొద్దులాగా .....
నువ్వు నవ్వుతుంటే.... దివ్వెలెందుకంటా ...
రెప్పలేయకుండా.. రెండుకళ్ల నిండా..
నిండు పున్నమల్లే .. నిన్ను నింపుకుంటా
రచన రెహమాన్.
ఇంకో పాట "రంగ్ దే " చిత్రంలోని "ఊరంతా వెన్నెలా..మనసంతా చీకటీ ...". రచన శ్రీ మణి . ఈయన నాకు మొట్ట మొదటగా తెలిసింది "సెగ" చిత్రంలోని "వర్షం ముందుగా " పాటతో. పోయిన వారం విడుదలయిన "వారియర్" సినిమాలో "బులెట్ " సాంగ్ సగం విని ఆపేసి అలవాటు ప్రకారం రాసిందెవరాని చూస్తే ఈయనే.... ప్చ్..
"మనసున ఏదో రాగం" ( సినిమా పేరు "ఎంత వాడు గాని")
కొన్ని నెలల క్రితం ఒక రాత్రి నాకు నిద్ర పట్టక కొత్త పాటలకోసం వెతుకుతుంటే ఈ పాట కనబడింది. హారిస్ జయరాజ్ ట్యూను బావుంటుంది. గాయని గొంతు అద్భుతం.కానీ ఒకటి రెండు లైన్లు మినహాయిస్తే "అయ్యబాబోయ్, ఏంటిది ?" అనిపించే సాహిత్యం. ఈ లైనేదో బావుందే అనుకొనేలోపు తర్వాతి లైను బొప్పికట్టించేస్తుందన్నమాట . : )
ఏ మాట కామాటే దాదాపు ఒక రెండు మూడు నెలలపాటు నాకు హాయిగా జోల పాడిన పాట ఇది. పక్కన పడుకున్న పిల్లలకి ఇబ్బంది కలగకూడదని ఇయర్ బడ్స్ పెట్టుకుని,పాటని లూప్ లో పెట్టుకొని పదే పదే ఈ పాట వింటూ నిద్రపోయిన రాత్రులెన్నో.సగటు తెలుగు సినిమా చూస్తున్నప్పుడు "లాజిక్" అనే పదాన్ని మన బుర్రలోంచి ఎలా చెరిపేస్తామో అలాగే పంటి కింద రాళ్ల లాంటి ఆ పదాల మీద దృష్టి పెట్టకుండా జస్ట్ ట్యూన్ నీ, చిన్మయిగారి గానాన్నీ ఆస్వాదిస్తూ నిద్రని ఆహ్వానించేవాడిని.
ఈ పాట రాసింది ఏ .ఎం .రత్నం మరియు శివ గణేష్ అట.